జైనూర్, ఏప్రిల్ 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఊయల కట్టి ఊగుతుండగా, పెట్టెలు, బెంచ్ తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. హెచ్ఎం భీంరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గంగాపూర్కు చెందిన దుర్వ అన్వేష్ (10) పానాపటార్ ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఒంటిపూట బడి కావడంతో శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తరువాత హాస్టల్ గదిలోకి వెళ్లాడు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకునేందుకు సిద్ధమయ్యాడు. చద్దర్లతో రెండు బెంచులకు ఊయల కట్టి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పెట్టెలు, బెంచ్ అతడి తలపై పడటంతో బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కాగా, జైనూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. తన ఇంట్లో పెండ్లి ఉన్నందున వార్డెన్ శుక్రవారం లీవ్లో ఉన్నారని, ఇన్చార్జి వార్డెన్గా ప్రకాశ్ ఉన్నారని హెచ్ఎం భీంరావ్ తెలిపారు. బాలుడి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని, దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాలుడి తండ్రి దుర్వ జంగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
నర్వ, ఏప్రిల్ 10: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. నర్వ మండలం బెక్కర్పల్లికి చెందిన భీంసాని రాములు (47) మూడున్నర ఎకరాల్లో చెరుకుపంట సాగుచేశాడు. గురువారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్తుకంచెకు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.