ములుగు : గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేంతవరకు కేంద్రంపై పోరాటాలు చేస్తామని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ వెల్లడించారు. వర్సిటీ పై నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద వామపక్షాలతో కలిసి నిరసన దీక్ష చేపడుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 13వ షెడ్యూల్లో ఇరు రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం చట్టం చేసిందని గుర్తు చేశారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా పక్షపాత వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు.
కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 2న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్షను చేపడుతున్నట్లు వెల్లడించారు. వామపక్ష పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.