హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించనున్న హెచ్ఐసీసీ, బహిరంగ సభ జరగనున్న సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే ఎస్పీజీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. రాష్ట్ర పోలీస్శాఖ నుంచి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల సిబ్బందికి బందోబస్తు విధులను అప్పగించారు. 5 వేల మందికి పైగా సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్ఐసీసీ, రాజ్భవన్, సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్గా గుర్తిస్తూ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీచేశారు. ఈ పరిధిలో డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పారా గె్లైడర్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్స్ను నిషేధించారు. సమావేశ ప్రాంగణం, ఆయా రూట్లలో, పరేడ్గ్రౌండ్ మైదానం పరిసరాల్లోనూ సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్, ఇతర సిబ్బందిని మఫ్టీలోనూ నియమించారు. పరేడ్గ్రౌండ్స్లో పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతం, వేదిక, చుట్టూ ఉన్న భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎస్పీజీ అధికారులు సేకరించారు. అవసరం మేరకు ఆయా పాయింట్లలో సాయుధ సిబ్బందిని నియమించనున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు బస చేయనున్న హోటళ్లు సహా అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సాయుధ పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.