హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో మరోసారి సమ్మె వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఈసారి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో సమ్మెకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగుల్లో ఈ అంశంపై తీవ్రస్థాయిలో రహస్యంగా చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలనే హామీ అమలు చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు.
ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతున్నదని కార్మిక సంఘాల వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రతినిధుల భాగస్వామ్యం కావాలని, ఇందుకు ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు జరుగడం అత్యవసరమని మంత్రి పొన్నం చెప్పడంతో సర్కార్ కావాలనే తాత్సారం చేస్తున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకే వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు, సంఘాల్లో అంతర్మథనం మొదలైంది.
ప్రస్తుతం వివిధ కార్మిక సంఘాలు తమ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి అపాయింటెడ్ డేపై స్పష్టమైన ప్రకటన రాకపోతే సమ్మెకు వెళ్లాల్సిందేనని మెజారిటీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అభిప్రాయపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అన్ని సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశాలపైనా రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. సమ్మె తేదీపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం లేకపోయినా, అవసరమైతే దశలవారీ ఆందోళనలు చేపట్టి.. అపాయింటెడ్ డే కోసం నిరవధిక సమ్మెకు వెళ్లే అవకాశాన్ని కూడా కార్మిక సంఘాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా, వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏప్రిల్లో సమ్మెకు వెళ్లారు. నాడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చినా.. నేడు దానిని అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది.
ఆర్టీసీ విలీనం చేపడుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మొదట ఎన్నికలు నిర్వహించాలని మెలిక పెట్టింది. మొదట అపాయింటెడ్ డే ప్రకటించి తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చని ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ప్రభుత్వానికి విన్నవించాయి. అయినప్పటికీ సర్కార్ మొండిగా ఎన్నికలకు వెళ్లాలనుకోవడం కార్మిక సంఘాలకు నచ్చడం లేదు. దీంతో ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజేఎంయూ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. పలువురు రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అయినా ప్రభుత్వం పట్టువీడటం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్మిక సంఘాల అంతర్గత చర్చలు వేగం పుంజుకున్నాయి. ఆర్టీసీలో మరోసారి సమ్మె వాతావరణం నెలకొన్నది. ఈ అంశాన్ని పసిగట్టిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హడావుడిగా తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా చర్చలకు పిలిచి సమస్యను పరిషరిస్తుందా? లేక ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పడతాయా? అనేది త్వరలోనే తేలనున్నది.