హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్టు యజమానులు వెల్లడించారు. దీంతో పాటు తమకు ప్రతినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55వేలకు పెంచాలని కోరారు.
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5వేలకుపైగా వాహనాలు నిచిలిపోనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్యాదవ్, జనరల్ సెక్రటరీ రాజు తెలిపారు. దాదాపు 5వేలకు పైగా ఉన్న అద్దె వాహనాలకు ప్రభుత్వం 18 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలు చెల్లించలేక యజమానులు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారని పేరొన్నారు. ఈఎంఐలు చెల్లించలేక తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొన్నదని జనరల్ సెక్రటరీ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.