హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కల్తీచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ప్రాంగణంలో రూ.2.4 కోట్ల విలువైన నాలుగు మొబైల్ టెస్టింగ్ బస్సులు, రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. పాలు, చిరుధాన్యాలు, నూనెలు, మసాలా దినుసులు, స్వీట్లు, రెడీమేడ్ ఫుడ్ ఇతర ల్యాబులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి కల్తీ జరిగే తీరు, పరీక్షల విధానంను అడిగి తెలుసుకొన్నారు. ప్రజల ఆరోగ్యం అధికారుల చేతుల్లోనే ఉంటుందని, నాణ్యమైన ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కల్తీ చేసేవారిపై కఠినంగా వ్యవహరించి నెలవారీ రిపోర్టులు పంపాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసి సర్ప్రైజ్ విజిట్స్ చేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కో మొబైల్ టెస్టింగ్ బస్సును అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆ బస్సుల్లో తిరుగుతూ కల్తీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆహారకల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు సైతం ఇందులో భాగస్వాములు కావాలని, కల్తీ జరిగితే వెంటనే 040- 21111111 నంబర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.