హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పోడుపేరుతో ఇకపై అడవుల నరికివేతకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలు అమలుచేసి కఠిన చర్యలు తీసుకొంటామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, డీఎఫ్వో, డీటీడీవో(జిల్లా గిరిజనాభివృద్ధి అధికారులు)లతో ఏర్పాటుచేసిన అటవీహక్కుల చట్టంపై నిర్వహించిన వర్క్షాప్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు పోడు భూములపై హకులు కల్పించేందుకు పారదర్శక పరిషారం చూపాలని కోరారు. అర్హులు కానీ వారికి ఏ కారణంగా హక్కులు కల్పించలేదో వివరించి చెప్పాలని సూచించారు. పోడుభూముల సర్వేలో అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
అటవీ హక్కుల చట్టం-2005 నిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిషారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదని, క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. హ్యాబిటేషన్, డివిజన్, జిల్లా కమిటీలతో శాశ్వత పరిష్కారం కనుగొనేదిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. హరితహారంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని, మానవ, జీవ జాతుల మనుగడ అడవుల సంరక్షణపై ఆధారపడి ఉన్నదని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సంరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ పర్గేన్ పాల్గొన్నారు.