ఎక్సైజ్ సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరించాలి
ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు
ఆ శాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టీకరణ
పదోన్నతులు పొందినవారికి పోస్టింగ్ పత్రాలు అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం అండగా ఉన్నందున ఎక్సైజ్ సిబ్బంది ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎక్సైజ్ శాఖలోని వివిధ క్యాడర్లలో పదోన్నతులు పొందిన అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం తన అధికారిక నివాసంలో పోస్టింగ్ పత్రాలను అందజేశారు.
ఒక అడిషనల్ కమిషనర్, నలుగురు జాయింట్ కమిషనర్లు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, 18 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 26 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 29 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు పోస్టింగ్ పత్రాలు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్ స్ట్రెంత్ అప్గ్రెడేషన్, పదోన్నతులతో ఎక్సైజ్ శాఖను పటిష్ఠం చేశామన్నారు. అవసరం మేరకు మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టింగ్ల విషయంలో గతంలో ఎన్నో పైరవీలు జరిగేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పారదర్శకంగా పోస్టింగ్లు ఇస్తున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులంతా బాగా పనిచేసి రాష్ర్టానికి మంచి పేరు తేవాలని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.