కరీంనగర్ : ప్రజలు గర్వపడేలా కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మున్సిపల్, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలని అన్నారు. రోడ్లను వేశాక కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి పాడు చేయవద్దని, మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన రోడ్లను తవ్వి పాడుచేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ చొరవతో కరీంనగర్కు స్మార్ట్ సిటీ మంజూరు అయిందని తెలిపారు. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నగరంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రజల సహకారంతో రోడ్లను వెడల్పు చేయడంతోపాటు, నాణ్యంగా రోడ్లు వేయాలని అధికారులకు సూచించారు.
స్మార్ట్ సిటీ పనులకు నిధుల కొరతలేదు..
స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి నిధులకు కొరత లేదని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో 14.5 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఫుట్ పాత్ లలో పాదచారులు నడిచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఊడ్చే యంత్రాలతో స్వచ్ఛ పనులు..
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రోడ్లను ఊడ్చే యంత్రాలతో రోడ్లపై మట్టి లేకుండా శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించే వ్యాపారులను రైతు బజార్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నగర జనాభా పెరుగుతున్న దృష్ట్యా నగరంలో అదనంగా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాశ్మీర్ గడ్డ రైతు బజార్ ను ఆధునిక రించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బస్టాండ్ వెనకాల నిర్మించిన షెడ్లను కూరగాయల వ్యాపారులకు కేటాయించాలని అన్నారు. టవర్ సర్కిల్ ప్రాంతంలో వ్యాపారులకు ఇబ్బంది లేకుండా తొందరగా స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల మైదానంలో చేపడుతున్న పార్కు పనులను 2022 ఫిబ్రవరి 14వ తేదీ లోపు పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వచ్చే నెల జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. డి ఎం ఎఫ్ టి నిధులతో చేపడుతున్న షాదీఖానా, ఆర్ అండ్ బి అతిథి గృహం, కళాభారతి ఆడిటోరియం, అంబేద్కర్ భవన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయాలని ఆదేశించారు.
నగరం నడిబొడ్డులో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లను ఆధునికరీస్తామని అన్నారు. డ్యామ్ దగ్గర లేక్ పోలీస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పొడవున నిర్మించతలపెట్టిన వాకింగ్ ట్రాక్ ను, సైకిల్ ట్రాక్ పను లను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
ఒమి క్రాన్తో అప్రమత్త..
జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు ను 100 శాతం, రెండో డోసు ను 86 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందు కు అధికారులను మంత్రి అభినందించారు. ఒమి క్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ నాయక్, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ ఈఈ రామన్, డిసిపి సుభాష్, సిపిఓ కొమురయ్య, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ అధికారులు సందీప్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈఈ సంపత్, తదితరులు పాల్గొన్నారు.