యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిధిలోని పొడిచెడు గ్రామంలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో 100 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
గ్రామానికి సమీపంలోని మూసీ నది వద్ద సుమారు 100కు పైగా గొర్రెలను ఉంచారు. అయితే గొర్రెల యజమానులు భోజనం చేసేందుకు తమ నివాసాలకు రాగా, వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దీంతో 100 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ గొర్రెలకు పశువుల వైద్యులు చికిత్స అందించారు.
ఈ ఘటనతో గొర్రెల యజమానులు బండ నర్సయ్య, బండ వెంకన్న, బండ సైదులు, కాసర్ల ఎల్లయ్య తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. 100 గొర్రెల మృతితో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల యజమానులు విజ్ఞప్తి చేశారు.