BJP | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో విచిత్ర పరిస్థితిని సృష్టించింది. తమకు టికెట్ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు టికెట్ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు. పార్టీ ఉనికిలో లేని సమయంలో సొంత ఖర్చుతో పార్టీని నిలబెట్టామని, తీరా టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని కొన్ని నియోజకవర్గాల నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇతరులకు, వేరే పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయించారని మండిపడుతున్నారు. తాజాగా సిరిసిల్లకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంత్రావు రాజీనామా చేశారు.
పార్టీలో కార్యకర్తల త్యాగాలకు గుర్తింపు లేదని, నియంతృత్వం పెరిగిపోయిందని ఆరోపించారు. బీజేపీ టికెట్ రాకపోవడమే మంచిదైందని, పైసలు మిగిలాయని పలువురు నేతలు సన్నిహితుల వద్ద ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. గత రెండు దఫాల్లో పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశామని, ఎన్నికల ఖర్చు తప్ప డిపాజిట్ కూడా రాలేదని తమ అనుభవాలను నెమరవేసుకుంటున్నారు. మరికొందరు టికెట్లు పొందిన అభ్యర్థులు తమకు బదులుగా వేరే వాళ్లను చూసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం.