ఆదిలాబాద్ /నారాయణపేట/బోధన్, నవంబర్ 12 : తెలంగాణలో పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంటే.. ఓర్వలేని మోదీ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇస్తున్నా కట్టడం లేదని రాష్ట్రంపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. లక్షలు విలువ చేసే ఇండ్లను అన్ని వసతులతో నిర్మించి ఇస్తుంటే.. ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రధాని మోదీ రామగుండంలో మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత అధ్వానంగా ఉన్నదో చూసి మాట్లాడాలని తెలంగాణ ప్రజానీకం సూచిస్తున్నది. చెప్పేది కొండంత.. ఇచ్చేది పిసరంత మాదిరి కర్ణాటకలో స్థలం కలిగిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ.6.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. చివరకు రూ.4 లక్షలు-4.5 లక్షలకు మించి అందకపోవడంతో చాలాచోట్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్క రాయచూర్ పట్టణంలోనే దాదాపు 2 వేల ఇండ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
మహారాష్ట్రలో రూ.1.25 లక్షలే
మహారాష్ట్రలోనూ పేదలకు గృహ నిర్మాణం కలగానే మిగిలిపోతున్నది. ఇక్కడ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద రూ.1.25 లక్షలే ఇస్తుండటం, అది కూడా ఏండ్ల తరబడి జాప్యం చేస్తుండటంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు ఆనుకొని మహారాష్ట్రలోని గ్రామాల్లో పక్కా గృహాల నిర్మాణం అధ్వానంగా ఉన్నది. రేకుల ఇండ్లు, సగం కట్టిన గోడలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వమిచ్చే కొద్ది మొత్తం పునాదుల నిర్మాణానికే చాలడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులు కలిపి కట్టుకొన్న ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అప్పు చేసి ఇల్లు పూర్తిచేశాం..
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’కింద ఇల్లు మంజూరైనా ఇచ్చింది కేవలం లక్షా 20 వేలే. ఏ మూలకు సరిపోలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకొన్నం. కేంద్ర సర్కార్ నుంచి వచ్చిన పైసలు బేస్మెంట్కు చాలలేదు. ఆ పైసలు కూడా టైమ్కు ఇయ్యలేదు. కరెంట్, తాగునీరు మేమే ఏర్పాటు చేసుకొన్నం.
– పీరాజీ, నంద దంపతులు, సగ్రోలి పాఠా, బిలోలి తాలూకా, నాందేడ్ జిల్లా
మోదీ సార్.. ఇదేనా ఆవాస్?
ఈ చిత్రంలోని తడకలు, రేకుల షెడ్ ముందున్న వారు నామ్దేవ్ సురేశ్, భానూబాయి దంపతులు. వీరికి సొంత ఆస్తులు, భూములు లేవు. కూలీ పనే ఆధారం. రెండుసార్లు పక్కా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా, 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైందని సమాచారం వచ్చింది. ఇల్లు సాయం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. 2020లో రెండోసారి దరఖాస్తు చేసుకొన్నా ఇల్లు మంజూరు కాలేదు. వీరి పరిస్థితి చూస్తే చాలు మహారాష్ట్రలో పక్కా గృహ నిర్మాణం ఎంత అధ్వానమో అర్ధమవుతున్నది.