హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎట్టకేలకు తెలంగాణ ఫిర్యాదుపై స్పందించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసింది. కేటాయింపులకు మించి అధిక మొత్తంలో కృష్ణానది జలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని, వెంటనే నిలువరించాలని తెలంగాణ నెలరోజులకు పైగా డిమాండ్ చేస్తూ వస్తున్నది. కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పలుమార్లు లేఖలు సైతం రాశారు. బోర్డు మెంబర్ సెక్రటరీని స్వయంగా కలిసి విన్నవించారు. 66:34 నిష్పత్తిలో ఏపీ 641.05, తెలంగాణ 330.23 టీఎంసీలను వినియోగించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కానీ, ఏపీ తన కోటాకు అదనంగా 70 టీఎంసీలకుపైగా వినియోగించుకున్నదని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. సాగర్ వద్ద కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి నీటిని ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ కుడి కాలువలోకి, తద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నదని, అది తెలంగాణ నీటిహక్కులకు తీవ్ర భంగం కలిగించనున్నదని, కేఆర్ఎంబీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నెలరోజుల తర్వాత కుడికాలువకు నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 28 నాటికే ఏపీ 32 టీఎంసీలను కోటాకు మించి వినియోగించుకున్నది. బోర్డు మాత్రం ఆ వివరాలను తెలపకపోవడం గమనార్హం.