యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ చీఫ్ జనరల్ నేనేజర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో సీఆర్పీసీ 91 సెక్షన్ ప్రకారం ఆయన ఆస్తుల వివరాలు సమర్పించాలని, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 1988 ప్రకారం సదరు భూముల రిజిస్ట్రేషన్ను నిలిపేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను ఏసీబీ కోరింది. ఈ మేరకు ఈ నెల 9న కలెక్టర్ హన్మంతు కే జెండగేకు ఏసీబీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈశ్వర్రావు లేఖ రాశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్-1988 ప్రకారం శివ బాలకృష్ణపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
శివ బాలకృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యుల పేరుతో భూములు కొన్నారని తెలిపారు. వలిగొండ మండలం నర్సాపూర్లో ఎస్ హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్ రఘుదేవిపై 11.03 ఎకరాలు, వలిగొండ మండలంలోని చిత్తాపూర్లో ఎస్ పద్మావతి పేరున 3.31 ఎకరాలు, బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లిలో ఎస్ అరుణ పేరు న 0.20 ఎకరాలు, మోత్కూరు మండలం పాలడుగులో వివిధ సర్వే నంబర్లలో ఎస్ నవీన్ పేరున 27.8 1/2 ఎకరాలు, వలిగొండ మండలంలోని రెడ్లరేపాడులో వివిధ సర్వే నంబర్లలో శివకుమార్ పేరున 14.85 ఎకరాల భూములు ఉన్నాయని వివరించారు. తాము పొందుపరిచిన 22 మందికి సంబంధించిన ధరణి పోర్టల్, ఇతర ఆఫీస్ రికార్డుల్లో ఎలాం టి ఆస్తులు రిజిస్టర్ అయినా వాటిని సైతం రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఫ్రీజ్ చేయాలని సూచించారు.