ముంబై, సెప్టెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలపరంపర కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. చమురు ధరలతోపాటు రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడంతో సూచీలు పతనాన్ని నిషేధించాయి. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 777.94 పాయింట్లు లేదా 1.04 శాతం తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 74,003.82 వద్ద స్థిరపడింది.
బ్లూచిప్ సంస్థలైన బ్యాంకింగ్, వాహన, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కుప్పకూలడం సూచీల పతనాన్ని శాసించింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 279.50 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టపోయి 23,118.60 వద్ద స్థిరపడింది. ఏప్రిల్ 6 తర్వాత సూచీకి ఇదే కనిష్ఠ స్థాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి జారుకునేటట్టు చేశాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు భారీ పతనాన్ని తగ్గించుకోగలిగాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ, హెక్సావేర్, ఇన్ఫోసిస్ షేర్లు నాలుగు శాతం లాభపడ్డాయి.