భారత అధ్యక్షతన జరిగిన 2026 బ్రిక్స్ సమ్మిట్ సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. విభిన్న ప్రయోజనాలు, అభిప్రాయ భేదాలున్న 11 దేశాలను ఒకే వేదికపై నిలబెట్టి న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపంలో ఒక సామూహిక ప్రకటనను వెలువరించడం చిన్న విషయమేమీ కాదు. ఏ దేశాన్నీ నేరుగా లక్ష్యంగా చేయకుండా, అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ‘సంయమనంతో వ్యవహరించాలి’ అనే సాధారణ భాషను ఉపయోగించడం ద్వారా సభ్య దేశాల మధ్య సర్దుబాటు సాధించారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని సదస్సు ఖండించడం భారత్కు దౌత్యపరమైన విజయమే. ఇది పరోక్షంగా పాకిస్థాన్ను ఏకాకి చేయడమే. అదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభంపై స్పష్టత రాకపోవడం బ్రిక్స్కు గల పరిమితులను బయటపెట్టింది.
ఇరాన్, యూఏఈ ఇప్పుడు బ్రిక్స్ సభ్యదేశాలు కావడంతో, ఆ ప్రాంత పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తూ, ఐక్యరాజ్య సమితి చార్టర్ను గౌరవించాలని, అధిక నియంత్రణ పాటించాలని బ్రిక్స్ సమ్మిట్ ముక్తసరిగా ప్రకటించింది. అయితే అందులో ఏ దేశాన్నీ నేరుగా ప్రస్తావించలేదు. ఇక ద్వైపాక్షికంగా చూస్తే, భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య విడిగా జరిగిన భేటీ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. గల్వాన్ ఘటన తర్వాత ప్రతిష్టంభనకు లోనైన భారత్-చైనా సంబంధాలు కొంతమేరకు మెత్తబడుతున్నాయనే సంకేతాలు దీని ద్వారా వెలువడినప్పటికీ, అపనమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగలేదనేది వాస్తవం. ఇరుదేశాల ప్రకటనల్లోని శైలిలో, ప్రాధాన్యతలో తొంగిచూసిన తేడాలే అందుకు నిదర్శనం.
బ్రిక్స్లో ఆర్థిక సంబంధాలు బలపడుతున్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా ఇతర దేశాలకు వాణిజ్య లోటు పెరుగుతున్నది. జాతీయ కరెన్సీల్లో పరస్పర చెల్లింపుల వ్యవస్థ ఇంకా కార్యరూపం దాల్చలేదు. గతంలో ప్రారంభించిన అనేక ప్రణాళికలు మధ్యలోనే ఆగిపోయిన దృష్ట్యా భారత్ ప్రతిపాదించిన కొనసాగింపు, అమలు యం త్రాంగం అనేది మంచి ఆలోచనే. 2021 తర్వాత భారత్ అధ్యక్ష వహించిన రెండో శిఖరాగ్ర సదస్సు ఇది. 2021లో 5 దేశాలు మాత్రమే ఉండగా, 2026లో ఆ సంఖ్య 11కు పెరిగింది. అదనంగా మరో 10 భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక బలం పెరిగినా, ఏకాభిప్రాయం అంత సులభం కాదనేది తేలిపోయింది. 2021లో కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ సమావేశం జరిగింది. 2026లో భారతదేశం 30 నగరాల్లో 350కి పైగా సమావేశాలు నిర్వహించడం విశేషం. బ్రిక్స్ దేశాలతో భారత వాణిజ్యం 2020-21లో 203 బిలియన్ డాలర్ల నుంచి 2025-26లో 417 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్రిక్స్ దేశాలు పరస్పర వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు జాతీయ కరెన్సీల్లో చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, అది పూర్తిస్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదు.
బ్రిక్స్ పేమెంట్ టాస్క్ఫోర్స్ ఆ దిశగా కృషిచేస్తున్నది. భారతదేశం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ను అనుసంధానించడం, డిజిటల్ కరెన్సీల మధ్య సమన్వయం సాధించడం వంటి ప్రతిపాదనలు చేసింది. అయితే, భిన్నమైన ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ నియంత్రణలు, మారక విధానాల కారణంగా వాటి అమలు కష్టంగా తయారైంది. బ్రిక్స్లో ఒక సాధారణ కరెన్సీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అది ఇప్పట్లో వాస్తవరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. బ్రిక్స్ పే వంటి ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఏదీ ఏమైనప్పటికీ విభిన్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో సామూహిక అవగాహనకు రావడం ప్రశంసనీయమే అయినప్పటికీ, నిర్ణయాలు వాస్తవరూపం దాల్చాలంటే అమలు దిశగా మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరం. లేకపోతే, బ్రిక్స్ కేవలం మాటలకే పరిమితమైన వేదికగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.