హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగంతో కేంద్ర ప్రభుత్వం తొండాట ఆడుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రైతు ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపారులకు ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులను శత్రువులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ వ్యవసాయరంగాన్ని ఎప్పుడు వ్యాపారులకు కట్టబెట్టాలా? అనే తొందరలో ఆయన ఉన్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము రైతులను ఇబ్బందుల పాలు చేయకూడదనే ఆలోచనతోనే ఢిల్లీకి వచ్చామని, ఏదో ఒకటి తేల్చుకొన్నాకే ఇక్కడి నుంచి కదులుతామని స్పష్టంచేశారు. వడ్ల కొనుగోళ్లు పార్టీలకు సంబంధించిన అంశం కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సినదని జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని వారితో భేటీ తర్వాతే గోయల్ తమకు సమయం ఇవ్వటం రాజకీయం కాక మరేమిటన్నారు. తాము ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని అడుగలేదని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని తమ రైతులకు న్యాయం చేయాలని కోరామని వెల్లడించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లాల్సింది, రైల్వే వ్యాగన్లు కేటాయించాల్సింది.. గోదాముల్లో నింపుకోవలసింది కేంద్రమేనని పేర్కొన్నారు.
బీజేపీకి తోక పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వస్తే కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి.. బీజేపీకి వంతపాడారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారని అన్నారు. బాధ్యతలేనివాళ్లు.. సోయిలేనివాళ్లు.. ప్రభుత్వాలంటే ఏమిటో తెలియనివాళ్లు ఇష్టారీతిగా మాట్లాడతారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ అని, దానికో నాయకుడూ లేడు.. విధానమూ లేదని ఎద్దేవాచేశారు.
రాష్ట్ర రైతాంగం సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారనే అక్కసుతో కేంద్ర సర్కారు కుట్రతో వ్యవహరిస్తున్నదని జగదీశ్రెడ్డి విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతాంగాన్ని సీఎం కేసీఆర్తో వేరు చేయలేరని తేల్చిచెప్పారు. ఒకవేళ తెలివి తక్కువతనంతో రాజకీయ ఎత్తుగడ వేస్తే బొక్కబోర్లాపడటం ఖాయమన్నారు. చైతన్యవంతమైన రాష్ట్ర రైతాంగానికి బీజేపీ, కాంగ్రెస్ దుర్మార్గాలు తెలుసన్నారు. రాష్ట్ర రైతులను రక్షించుకోవటం కోసం కేసీఆర్ ఒక్కరే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని దేశమంతా గమనించిందని తెలిపారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి పోయేది లేదని కేసీఆర్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు ప్రయోజనాల కోసం ఎన్ని రోజులైనా ఓపిక పడుతామని, ఎంతదూరమైనా వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కేంద్రం వ్యవసాయరంగ అభివృద్ధిని గుర్తించి, అండగా ఉంటుందా? లేదా? తేల్చుకోవాలని జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు.