హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఏ కోణంలో చూసినా.. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకొని, వాటి హక్కులను కాలరాసి, విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే దిశగా సంకేతాలు విస్పష్టంగానే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రతిపాదిత బిల్లును 13 రాష్ర్టాలు నిర్దంద్వంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటులో బిల్లు పాస్ కానే లేదు. కానీ.. కేంద్రం మాత్రం తాను అనుకొన్నది అనుకొన్నట్టు అమలు చేసే ఏర్పాట్లలో ఉన్నది. ఇందుకోసం ఒకదాని వెంట ఒకటిగా సర్క్యులర్లు, లేఖలు, ఉత్తర్వులు జారీచేస్తూ.. తాయిలాలు ప్రకటిస్తూ పోతున్నది. సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా సమాధి కట్టి.. అధికారాన్ని తన చేతిలోకి తీసుకొనేందుకు.. సంస్థలను ప్రైవేటీకరించేందుకు వీలుగానే కేంద్రం ముందడుగు వేస్తున్నది. పేరుకు మాత్రం రాష్ర్టాల అభిప్రాయాలను కోరినప్పటికీ.. వాటికి వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు.
వ్యవసాయానికీ మీటర్లు తప్పదు
ప్రతి విద్యుత్తు కనెక్షన్కు మీటర్ ఉండాలనేది కేంద్రం నిర్ణయం. వ్యవసాయానికి ఉపయోగించే బోరుబావుల్లోని మోటర్లకు సైతం మీటర్లు.. అందులోనూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను పెట్టాలని మొదటినుంచీ చెప్తున్నది. ఇందులో భాగంగానే నాలుగు సార్లు రాష్ర్టాలకు లేఖలు రాసింది. ఉత్తర్వులు జారీచేసింది. పాలసీలు ప్రకటించింది.
కొత్త విద్యుత్తు విధానం-2021 ప్రతిపాదనలను పరిశీలిస్తే విద్యుత్తు కనెక్షన్లన్నింటికీ మీటర్లు పెట్టడం తథ్యం. ప్రతిపాదించిన నూతన పాలసీలోని 7.17 క్లాజ్లో కొత్తగా కనెక్షన్లు ఇచ్చేవారికి తప్పనిసరిగా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని ఉన్నది. ఇప్పటికే ఉన్న మీటర్ల స్థానం లో ప్రీపెయిడ్ మీటర్లను దశలవారీగా అమర్చాలని పేర్కొన్నారు. వచ్చే మూడేండ్లలో వందశాతం పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇదే విషయాన్ని 27.4.2021న కేంద్ర ఇంధనశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలోనూ స్పష్టంచేశారు.
ఎలక్ట్రిసిటీ (రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్-2020లో పొందుపర్చిన నిబంధనలను చూస్తే.. క్లాజ్ 5లో చెప్పినట్టు.. ఒక్క కనెక్షన్ కూడా మీటర్ లేకుండా ఉండకూడదు. ఆ మీటర్ కూడా స్మార్ట్ ప్రీపెయిడ్ లేదా ప్రీపెయిడ్ మీటర్ అయి ఉండాలి.
ఎలక్ట్రిసిటీ చట్టం-2003కు తాజాగా సవరణలను ప్రతిపాదించింది. వీటిలో ఎలాంటి విద్యుత్తు కనెక్షన్కైనా.. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలంటే.. కచ్చితంగా ఆ కనెక్షన్కు మీటర్ బిగించి ఉండాలి. అంటే.. మీటర్ లేని కనెక్షన్కు సబ్సిడీ ఇవ్వరు.
అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఎఫ్ఆర్బీఎం పెంపు. తాజాగా కేంద్ర బడ్జెట్లో రాష్ర్టాల ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్)లో భాగంగా ఇప్పటివరకు ఉన్న 3.5%కి అదనంగా 0.5% రుణాలు తెచ్చుకొనేందుకు కేంద్రం అంగీకరిస్తూ ప్రతిపాదించింది. కానీ.. ఇలా అదనంగా తెచ్చుకొన్న 0.5% నిధులను విద్యుత్తు రంగంలోనే ఖర్చు పెట్టాలనే తిరకాసు పెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 9.6.2021 నాడు ఉత్తర్వులిచ్చింది.
దీని ప్రకారం ఈ అదనపు 0.5 శాతం రుణాలను తీసుకొనేందుకు రెండు నిబంధనలను పాటించాలని తేల్చిచెప్పారు. ఇందులో ఒకటి.. మొత్తం విద్యుత్తు వినియోగం (వ్యవసాయ కనెక్షన్లతో సహా)లో మీటర్లు ఉన్న వినియోగదారుల విద్యుత్తు వినియోగం ఎంతో తేల్చాలి. రెండోది.. ఇందుకోసం ప్రతి కనెక్షన్కు మీటర్ బిగించాలి. నెలవారీ కోటాను నిర్దేశించి, నిర్దేశించిన కోటాకు మించకుండా విద్యుత్తును వినియోగించుకొన్న రైతులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. నాలుగు సందర్భాల్లో కేంద్రం స్పష్టంచేసిన దానిని బట్టి.. అన్ని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు కచ్చితంగా మీటర్లు పెట్టాలన్నదే కేంద్రం వైఖరిగా తేలిపోతున్నది.
కేంద్రమంత్రి సూచన కూడా అదే..
డిస్కంల ఆర్థిక పరిస్థితి మార్చాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచిస్తూ సాక్షాత్తు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్కు 20.12.2019 నాడు లేఖ రాశారు. ఇందులో కేంద్రమంత్రి.. ‘అన్ని క్యాటగిరీల్లోని వినియోగదారులకు సంబంధించిన విద్యుత్తు వినియోగ గణాంకాలు స్పష్టంగా ఉండాలి. ఇలా గణాంకాలు స్పష్టంగా ఉంటేనే సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. విద్యుత్తు వినియోగానికి సంబంధించిన స్పష్టమైన గణాంకాలు కావాలంటే.. ఆక్యురేట్ మీటరింగ్ ఉండాల్సిందే. ఇలా అయితేనే ఎలాంటి వివాదాలు లేకుండా.. సబ్సిడీ ఎంత ఇస్తున్నారు అనే లెక్కలు స్పష్టంగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. అంటే ఇక్కడకూడా ప్రతి కనెక్షన్కు మీటర్ ఉండాలనేది స్పష్టంగా కేంద్ర మంత్రే అంగీకరించారు. ఇలా ఏ కోణంలో చూసినా, ఏ అంశాన్ని పరిశీలించినా, కేంద్రం ఎప్పటికప్పుడు మార్చి మార్చి జారీచేస్తున్న ఆదేశాలు, సర్క్యులర్లను పరిశీలించినా విద్యుత్తు విషయంలో రాష్ర్టాలకు ఉన్న అధికారాలను హరించి.. గుత్తాధిపత్యం చేపట్టాలనే ధోరణి స్పష్టంగా వెల్లడవుతున్నది. నష్టాలనే బూచిని చూపెట్టి డిస్కంలు, ఇతర విద్యుత్తు సంస్థలను ప్రైవేటుపరం చేయాలనేదానితోపాటు.. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు కూడా మీటర్లు పెట్టడమనేది కచ్చితంగా జరిగేలా చూడటమే కేంద్రం ప్రధాన లక్ష్యంగా కనపడుతున్నది.