బడులకు 3.5 లక్షల డ్యూయల్ డెస్క్ బెంచీలు
తొలివిడతలో 9,123 స్కూళ్లకు 2 లక్షల బల్లలు
ల్యాబ్లు, గ్రంథాలయాలకు ప్రత్యేకంగా ఫర్నిచర్
మన ఊరు – మన బడిలో భాగంగా అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : నేలపై కూర్చొని చదువుకొనే విధానానికి స్వస్తిపలుకుతూ, సర్కారు స్కూళ్ల విద్యార్థులకు స్టెయిన్లెస్ స్టీల్ బెంచీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 3.5 లక్షల డ్యూయల్ డెస్క్ బెంచీలు లభ్యంకానున్నాయి. తుప్పుపట్టి, వినియోగించడానికి వీలులేని ఇనుప బెంచీల స్థానంలో ‘వీటిని అందించనున్నారు. మన ఊరు -మన బడి’ పథకంలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు 2 లక్షల డ్యూయల్ డెస్క్ బెంచీలను సరఫరా చేయనున్నారు. మిగతా రెండువిడతల్లో 1.5 లక్షల బెంచీలు అందించాలని అధికారులు నిర్ణయించారు. స్కూళ్లకు ఫర్నిచర్ కొరతను తీర్చేందుకు అధికారులు ఐదు రకాల ఫర్నిచర్ను ప్రతిపాదించారు. పిల్లలకు డ్యూయల్ డెస్క్ బల్లలు, హెచ్ఎంలు, టీచర్లకు కుర్చీలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయాలకు ప్రత్యేక ఫర్నిచర్ను అందజేస్తారు. తొలివిడతలో రూ.3,497 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్ బల్లలకు రూ.250 కోట్లు వెచ్చించనున్నారు.
ఫర్నిచర్ ప్రత్యేకతలు – విశేషాలు..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల ఎత్తుకు తగినట్టుగా మూడు సైజుల్లో డ్యూయల్ డెస్క్ బల్లలను అందజేస్తారు.
పిల్లల బ్యాగులు, బుక్స్, నోటు పుస్తకాలు, వాటర్ బాటిళ్లను భద్రపరుచుకొనేలా డ్యూయల్ డెస్క్ బల్లలకు ఏర్పాట్లుంటాయి.
ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్ బల్లలను జైళ్లశాఖతోపాటు ఓ ప్రైవేట్ తయారీ సంస్థ నుంచి సరఫరా చేస్తారు. మొత్తం జైళ్లశాఖ నుంచే తెప్పించాలని భావించినా.. ఒకేసారి తయారుచేయడం సాధ్యపడకపోవడంతో ప్రైవేట్ సంస్థకు భాగస్వామ్యం కల్పించారు.
వీటిని రాష్ట్రస్థాయిలోనే బల్క్గా ఒకేసారి కొనుగోలు చేసి, పాఠశాలలవారీగా అందజేస్తారు.