జనగామ, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని.. మెజార్టీ ప్రజానీకం ముచ్చటగా మూడోసారి ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి అధికారం పగటికలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. గురువారం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డితో కలిసి కడియం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ చేయూత, పింఛన్ల పెంపు అంశాలు కేసీఆర్ సాహసోపేతంగా తీసుకున్న గొప్ప నిర్ణయాలని, ఇవి దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇప్పుడిప్పుడే ఈ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని ఆరోపించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ఆయా పార్టీల నాయకులను ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ కార్డును ప్రజలు విశ్వసించడం లేదని దుయ్యబట్టారు. ఆరునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో.. ప్రకటించిన పథకాలను అమలు చేసి చూపాలని సవాల్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఉండి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పథకాలను అమలు చేయకుండా.. డిక్లరేషన్లు ప్రకటించకుండా రాష్ర్టానికో విధానాన్ని ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం అనేది సదరు రాజకీయ పార్టీల దివాలాకోరుతనం కాదా? అని నిలదీశారు. గుజరాత్, కర్నాటకలో లేని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని చెబితే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అవినీతికి దూరంగా ఉంటూ నిజాయతీగా పనిచేస్తానని తెలిపారు. తప్పు పనిచేయను.. నియోజకవర్గ ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించనని ఆయన స్పష్టం చేశారు.