హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం వల్లే వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ బిడ్డలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పేర్కొన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియన్ ఆరిజన్(ఆపీ)కు చెందిన వైద్యుల బృందం బుధవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసింది. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలోని ఈ బృందం వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిపై మంత్రితో చర్చించింది.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ సీఎం సూచన మేరకు గర్భిణులు, నవజాత శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు పేదల వైద్య ఖర్చులను తగ్గిస్తున్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ల బృందం యూఎస్ నుంచి వైద్య విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో బహిరంగ చర్చలు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్, పీజీ కోర్సులు, ఫ్యాకల్టీ ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. వైద్య బృందంలో డాక్టర్ హన్మంత్ బెజ్జంకి, సతీశ్ కత్తుల, మెహెర్ మేదేవరం, రఘు, సుజిత్ పున్నం, శ్రీని గంగసాని, హేమ తదితరులు ఉన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియన్ ఆరిజన్లో 20 వేల మంది తెలంగాణ చెందిన వైద్యులతోపాటు మొత్తం 80 వేల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు.