రఘునాథపాలెం, మే 31: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కేవలం తొమ్మిందేండ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను చూసి కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇవాళ అదే ప్రభుత్వంపై, తనపై అడ్డగోలుగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ను గద్దె దించుతామంటూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డబ్బుతో, అహంతో ప్రజల ఆత్మాభిమానాలను కొనలేరనే విషయాన్ని గుర్తించాలని పొంగులేటికి మంత్రి హితవు పలికారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకొంటున్న బీజేపీకి తెలంగాణలో దిక్కులేని పరిస్థితులే ఉన్నాయని మంత్రి పువ్వాడ విమర్శించారు. కాంగ్రెస్కు 60 స్థానాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల సమయమే ఉన్నందున బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆరే మూడోసారీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.