కరీంనగర్ తెలంగాణచౌక్, మే 7: ప్రాణాలకు తెగించి కొట్లాడి.. తెలంగాణను సాధించిన కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులపై ఆయనకు తప్ప మరెవరికీ సోయిలేదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు తెచ్చిన కేసీఆర్తోనే దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు టీఎమ్మార్సీఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, నూతన సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో రెసిడెన్షియల్ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సారంగం, నియోజవర్గ ఇన్చార్జి వెంకటేశ్తోపాటు నాయకులు మధు, హనుమయ్య, రమేశ్, రాము, నగేశ్ పాల్గొన్నారు.