Revanth Reddy | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కు లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్కు రాజకీయ సమాధేనని హెచ్చరించారు. రైతువేదికల వద్ద కాంగ్రెస్ నిజస్వరూపాన్ని రైతులు బయటపెడుతున్నారని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్తుపై సమాధానం చెప్పకుండా రేవంత్రెడ్డి డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రేపిన ఉచిత విద్యుత్తు దుమారం, కాంగ్రెస్ పార్టీని రైతులు నిలదీస్తున్న వైనం, వాటి నేపథ్యాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వటం లేదని కాంగ్రెస్ వాదిస్తున్నది. నిరూపిస్తామని శపథం చేస్తున్నది. దీనిపై మీరేమంటారు?
వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని, 3 గంటలు చాలు అని పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రకటించిన తరువా త రైతాంగమే కాదు కాంగ్రెస్ నేతలంతా రేవంత్పై తిరుగుబాటు చేస్తున్నారు. ఇంటా బయటా ఒంటరి అయిన తరువాత తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారిని భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గం టల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పకుండా డొంకతిరుగుడు ముచ్చట్లు ఎం దుకు? రాష్ట్రంలో వ్యవసాయం చాలావరకు బోరు బావులపై ఆధారపడి ఉన్నదని, రైతుల బతుకులు మార్చాలని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు గురించి ఆలోచించారు. 2014లో తెలంగాణలో 19.08 లక్షల బోర్లు ఉంటే ప్రస్తుతం 30 లక్షలకు పెరిగాయి. అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తుండటం నిజం కాదా? రైతు వ్యతిరేక నాయకులు, పార్టీలు సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు, కేవలం 3 గంటల సరఫరా చేస్తే సరిపోతుదంటూ తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. దీనిపై రైతువేదికల వద్ద రైతులు చర్చించి తీర్మానాలు చేస్తున్నారు. రేవంత్ వాదనను, విధానాలను ఖండిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తు ను కొనసాగించాలని తీర్మానిస్తున్నారు.
బీఆర్ఎస్ చేపట్టిన 10 రోజుల కార్యాచరణకు రైతు వేదికలను ఎంచుకోవడంలో ఆంతర్యం ఏమిటి?
రైతుల కష్టాలు, సమస్యలను చర్చించుకోవడానికి, వారిలో ఐక్యత తీసుకురావడానికి రాష్ట్రంలోని 2,604 వ్యవసాయ క్లస్టర్లలో సుమారు రూ.570 కోట్లు ఖర్చు చేసి రైతువేదికలను నిర్మించి కేసీఆర్ రైతులకు బహూకరించారు. ఇది చరిత్ర. రైతుల కండ్లముందు కనిపిస్తున్న కఠోర నిజం. ఇవాళ రైతు వేదికలు కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టే కేంద్రాలుగా మారిపోతున్నాయి. చైతన్యవంతులైన రైతులు రైతు వేదికల నుంచే కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారు. వాటిని చూస్తే కాంగ్రెస్కు వణుకు పుడుతున్నది.
ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్దే నని ఆ పార్టీ చెప్తున్నది. మీరేమంటారు?
ఇంత కన్నా పెద్ద జోక్ ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర ఏనాడైనా ఉన్నదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ర్టాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తెలంగాణలో మాట్లాడాలని స్పష్టంగా చెప్తు న్నాం. ఛత్తీస్గఢ్లో విద్యుత్తు ఉన్నా అక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? ఛత్తీస్గఢ్లో ఉన్న విద్యుత్తును అమ్ముకుంటారు కానీ రైతులకు ఇవ్వరు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి పగలూ రాత్రి కలిపి ఎన్ని గంటలు ఇచ్చారు? ఎంత నాణ్యమైన కరెంటు ఇచ్చా రు? ఆనాడు రైతులు పడ్డ అవస్థలు ఎన్ని? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అన్నది ఏ రైతును అడిగినా చెప్తారు. ఉచిత విద్యుత్తు హామీని విస్మరించి రైతులను మోసం చేసిన పార్టీని, మోసగాడు రేవంత్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో 3 గంటలే చాలు అని చెప్పిన పార్టీని రైతులే కాదు ఏ వర్గమూ నమ్మదు. కరెంటుపై కాంగ్రెస్ వైఖరిని అడుగడుగునా నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీని రైతులు వదిలిపెట్టరు.
రాహుల్ పొలాల్లో నాట్లు కూడా వేస్తుంటే రైతు కష్టాలు తెలియవని అంటున్నారేమిటి?
ఏదో డ్రామా కోసం హర్యానా వెళ్లి పొలం లో దిగి రాహుల్గాంధీ నాటేసినట్టు నటనను రక్తికట్టించారు. రాహుల్గాంధీకి వ్యవసా యం, రైతుల గురించి అసలే తెలియదు. అందుకే మా వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్గాంధీకి ఎద్దు తెల్వదు ఎవుసం తెలవదని చెప్పిండు. అదే నిజం. రేవంత్రెడ్డి ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలిపేరోజు దగ్గరలోనే ఉన్నది. రైతులకు అందిస్తున్న 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు ఉండాలా? కాంగ్రెస్కు ఏనాడైనా ఇలా ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వెలుగు జిలుగుల కరెంటు జీవితం నిజమా? కాదా? అన్నది ఏ రైతును అడిగినా చెప్తారు. 24 గంటల కరెంటు రావడంలేదని తెలంగాణలో ఏ రైతు అయినా అన్నడా? ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలో ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కరెంట్పై చర్చ పెట్టారా? కనీసం ఒక ప్రశ్న అయినా వేశారా? అని అడుగుతున్నాం. దమ్ముంటే చెప్పమనండి. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీకి రైతులే దొరికారా?
అదే రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ను నిలదీయాలని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీన్నెలా చూస్తారు?
పూటకోమాట.. గంటకో అబద్ధం చెప్పే వ్యక్తులను ఏమిచేయాలో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు అనుచరులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్ని ఎకరాలకు ఎంత కరెంటు కావాలని శాస్త్రీయంగా లెక్కలు ఉన్నా ‘పిచ్చోడు ఇట్లా మాట్లాడుతున్నాడేంది?’ అని ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఇలాంటి నాయకుడు పీసీసీ అధ్యక్షుడు కావడం కాంగ్రెస్ దౌర్భాగ్యం’ అని ఆ పార్టీ వాళ్లే నెత్తినోరూ కొట్టుకుంటున్నారు. రేవంత్రెడ్డికే కాదు.. రాహుల్గాంధీకి కూడా రైతుల కష్టాలు తెలియవు. కాబట్టే వాళ్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.