BRS Party | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నింట్లోనూ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం వెల్లడించారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని తెలిపారు. త్వరలో నాగ్పూర్లో పార్టీ విశాలమైన సొంత కార్యాలయాన్ని ప్రారంభించుకోనున్నదని చెప్పారు. మహారాష్ట్ర కో-ఆర్డినేటర్ బీజే దేశ్ముఖ్, పుణె జిల్లా కో-ఆర్డినేటర్ రాహుల్ కల్బోర్లతో కలిసి సోమవారం ఆయన పుణెలో మీడియాతో మాట్లాడారు. కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వనరులున్న మహారాష్ట్ర తెలంగాణతరహాలో ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు.
తెలంగాణ మాడల్ను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నా, మహారాష్ట్ర సర్కారు నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. మహారాష్ట్రలో ఉన్న ఏ రాజకీయ పార్టీతోనూ ప్రజల జీవితం మారిపోదని అన్నారు. మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు, వాస్తవికమైన వికాసం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్సే తమ కలలను సాకారం చేసే పార్టీగా భావిస్తున్నారని, ఐదు రోజుల్లోనే మహారాష్ట్రలో లక్షా 88 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో అతి స్వల్పకాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో డిజిటల్ మెంబర్షిప్ను నమోదు చేసిన పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
నాగ్పూర్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభించనున్నారని మాణిక్రావు కదం వెల్లడించారు. పుణెలో ఎకరం స్థలంలో, అదే స్థాయిలో ఔరంగాబాద్ సహా మొత్తం నాలుగు చోట్ల బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకొంటున్నదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం అద్భుతంగా సాగుతున్నదని, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు.