నకిరేకల్/ సూర్యాపేట రూరల్, జనవరి 22 : బీఆర్ఎస్ పార్టీతోనే దేశమంతా 24 గంటలపాటు విద్యుత్తు వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఆదివారం మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ మట్టిపల్లి కవిత, యువ నాయకుడు చిట్యాల అశోక్తోపాటు 300 మంది యువకులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ 200 మంది కార్యకర్తలతో కలిసి గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేతగానితనం వల్లే దేశంలో చీకటి అలుముకున్నదని విమర్శించారు.
తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంటు తమకెందుకు ఇవ్వడం లేదని దేశ ప్రజలు మోదీని ప్రశ్నిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సాగుకు 6 గంటలు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారని తెలిపారు. అక్కడి ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఒకరిద్దరు సంపన్నులకు దోచిపెట్టేందుకే పాలన చేస్తున్నారని విమర్శించారు.
ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మున్సిపాలిటీలోని పలు వార్డులు, మండలంలోని మంతపురి, బహదూర్పేట గ్రామాలకు చెందిన 2 వేల మంది బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరినవారిలో బహదూర్పేట మాజీ సర్పంచ్ జంపాల దశరథ, మాజీ ఉప సర్పంచ్ మొగిలి మల్లయ్య, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల శంకర్, బీజేపీ 11వ వార్డు అధ్యక్షుడు దయ్యాల సంపత్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల నర్సింగరావు, పెయింటర్ల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పంగ కిషన్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు వట్టిపల్లి సిద్ధిమల్లయ్య, ఆలేరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వనం రాజు ఉన్నారు.
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన సింగిల్విండో డైరెక్టర్ బైరెడ్డి అశోక్రెడ్డితోపాటు 20 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య పాల్గొన్నారు.