జగిత్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కళంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెవరూ లేరని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో గురువారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో నీచాతి నీచమైన పద్ధతులకు, దుర్మార్గాలకు అతడు తెరలేపాడని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను కలుషితం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
రాజకీయాలంటే విలువలతో కూడినవని, బండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడటం సిగ్గుచేటని హితవుపలికారు. సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని పరిశీలించి, దాని అభివృద్ధికి అవసరమైతే రూ.వెయ్యి కోట్లనైనా మంజూరు చేస్తానని ప్రకటిస్తే.. ఈ విషయపై బండి సంజయ్ నీచంగా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయినైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. కొండగట్టు అంజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బండి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కొండగట్టు అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెస్తావా? రాష్ట్రంలోని ఒక్క ఆలయానికైనా రూపాయి తెప్పించావా? అని నిలదీశారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి దమ్ముంటే కొండగట్టు దేవాలయ అభివృద్ధికి ఏం చేస్తారో 24 గంటల్లోగా చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ చేశారు. ఒక వేళ స్పందించకపోతే హిందూ బిడ్డలందరూ ఆయనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోసం చేయడమా? అని ప్రశ్నించారు. మతం, దేవుళ్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే బండి సంజయ్.. ఆయన నియోజకవర్గంలోని ఏ దేవాలయ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, చొప్పదండి నాయకులు రవీందర్, గుర్రం నీరజ, కరబూజ తిరుపతి పాల్గొన్నారు.