హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరుల స్మారకచిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు మూడు గంటల పాటు అన్ని అంతస్తులను కలయతిరిగి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులకు, వర్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నంలో ఏర్పాటు చేసే మ్యూజియం, ఆడిటోరియం పైఅంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ నిర్మాణాలు పరిశీలించి మంత్రి కొన్ని సూచనలు చేశారు. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి అమరుస్తున్న అరుదైన స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ పనులను మంత్రి ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి షీట్స్ బిగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్ ఏజెన్సీని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ స్మారచిహ్నంలోని నిరంతరం జ్వలించే జ్యోతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఫినిషింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంగణం అంతా పచ్చదనంతో, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.