గాంధీ చౌక్, జనవరి 27: న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టీ మాధవీదేవి ఆకాంక్షించారు. ఇప్పటికే జగిత్యాల కోర్టులో ఈ-ఫైలింగ్ను ప్రారంభించామని, త్వరలోనే అన్ని జిల్లా కోర్టుల్లోనూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. శనివారం సిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి జే శ్రీనివాస్రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాధవీదేవి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి గొప్పదని, నిరంతర పఠనం, సీనియర్ అడ్వకేట్ల సలహాలు, సూచనలతో జూనియర్ అడ్వకేట్లు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఉన్నత న్యాయస్థానాల ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమింగ్ను డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా వీక్షిస్తూ తమను తాము సానబెట్టుకోవాలని తెలిపారు. హైకోర్టులో వర్చువల్ విధానం అందుబాటులో ఉందని, మున్ముందు అన్ని కోర్టుల్లో అమలు కానుందని చెప్పారు. హైకోర్టు జడ్జి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి ఆరంభంలో కష్టాలు ఎదురైనా నిబద్ధతతో పని చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, జగిత్యాల జడ్జిలు ఎన్ ప్రేమలత, నీలిమ, ఎస్పీ అఖిల్మహాజన్, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, సభ్యుడు ఆడెపు వేణు పాల్గొన్నారు.