హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక రంగంపై తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర రాబడి ఎంత? ఖర్చులేమిటి? అనే అంశాలపై శ్రద్ధ పెట్టారు. అనేక సంస్కరణలతో సంపదను సృష్టించి ప్రజలకు పంచిపెట్టారు. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. తద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవడంతోపాటు దశాబ్దాల చరిత్ర కలిగిన రాష్ర్టాలకు ఆర్థిక పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. అందుకు మరో ప్రబల నిదర్శనమే తాజాగా విడుదలైన ‘తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్’ పుస్తకం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది? గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఏ స్థాయికి ఎదిగింది? అనే విషయాలను ఈ పుస్తకంలో స్పష్టంగా పొందుపరిచారు.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే ప్రధాన గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం రెండున్నర రెట్లకుపైగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,12,398కి ఎగబాకింది. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.86,647 నుంచి రూ.1,72,276కి పెరిగింది. దీని కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,122 ఎక్కువ. 2014-15తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 152 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో దేశ తలసరి ఆదాయ వృద్ధి 99 శాతానికి పరిమితమైంది. ‘తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్’ గణాంకాల ప్రకారం.. తలసరి ఆదాయంలో తెలంగాణ గత తొమ్మిదేండ్లలో 12.2% వార్షిక సగటు వృద్ధిరేటు (యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్-ఏఏజీఆర్)ను, 12.2% చక్ర వార్షిక వృద్ధిరేటు (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్-సీఏజీఆర్)ను సాధించింది. ఇదే సమయంలో దేశ ఏఏజీఆర్ 9.2 శాతానికి, సీఏజీఆర్ 9 శాతానికి పరిమితమైంది.
దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందిందా? లేక మందగమనంలోకి జారుకున్నదా? అన్నదాన్ని నిర్ణయించడంలో జీడీపీ/జీఎస్డీపీనే కీలకం. జీడీపీ వృద్ధి చెందితే దేశం, జీఎస్డీపీ వృద్ధి చెందితే రాష్ట్రం ఆర్థిక, సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో పురోగమించినట్టే. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా జీడీపీ/జీఎస్డీపీలనే ప్రామాణికంగా తీసుకుంటాయి. అటువంటి జీఎస్డీపీలో తెలంగాణ గత తొమ్మిదేండ్లలో ఏకంగా 160% వృద్ధిని సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.5,05,849 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.13,13,391 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.1,24,67,959 కోట్ల నుంచి రూ.2,72,40,712 కోట్లకు చేరడంతో వృద్ధి 118 శాతానికే పరిమితమైంది. ‘తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్” లెక్కల ప్రకారం.. జీఎస్డీపీలో తెలంగాణ గత తొమ్మిదేండ్లలో 12.7% ఏఏజీఆర్ను, 12.7% సీఏజీఆర్ను సాధించింది. ఇదే సమయంలో దేశ ఏఏజీఆర్ 10.5 శాతానికి, సీఏజీఆర్ 10.3 శాతానికి పరిమితమైంది.