Oil Palm | మంచిర్యాల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో ఆయిల్పామ్ పంట సాగుచేసిన ఉత్తర తెలంగాణ రైతులు కోతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో 2,200 ఎకరాల్లో సాగుచేయగా.. ప్రస్తుతం 284 ఎకరాల్లో కోతకు వచ్చింది. కోటపల్లి మండలం రాపనపల్లికి చెందిన రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్ గుర్రం లక్ష్మి, సుంకరి రమేశ్, సంతోష్ కలిసి 10 ఎకరాల్లో మూడేండ్ల కిందట ఆయిల్పామ్సాగు చేశారు. శుక్రవారం పూజలు చేసి పంట కోతను ప్రారంభించారు. దీర్ఘకాలం ఆదాయమిచ్చే ఈ పంటను విప్ బాల్క సుమన్ సహకారంతో వేశామని, ప్రస్తుతం 408 కిలోల దిగుబడి వచ్చిందని, మొక్కలు సరఫరా చేసిన కంపెనీ(మ్యాట్రిక్స్)యే టన్నుకు రూ.13,901 చొప్పున కొనేందుకు ముందుకొచ్చిందని ఆయిల్పామ్ రైతులు సంబురపడుతున్నారు.
మూడేండ్ల శ్రమకు ఫలితం
ప్రభుత్వం ఆయిల్పామ్ పంటను ప్రోత్సహిస్తున్నదని తెలిసిన వెంటనే రాపనపల్లి గ్రామానికి చెందిన రైతుబంధు మండల కన్వీనర్ గ్రురం రాజన్న తనతోపాటు ఇద్దరు అల్లుండ్లు, తమ్ముడిని ఒప్పించి మొత్తం 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మూడేండ్లుగా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినందుకు ఈ రోజు ప్రతిఫలం దక్కిందని రాజన్న దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు రెండు ఎకరాల్లో 4 క్వింటాళ్లు (408 కిలోలు) కోశామని, మరో ఐదారు రోజులు ఆగి మిగిలిన పంటను కోస్తామని చెప్పారు. సాధారణ పం టలు వేస్తే ఒక పంటపై ఎకరానికి రూ.30 వేలు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే
సర్కారు ప్రోత్సాహం, విప్ బాల్క సుమన్ సూచనతో మూడేండ్ల కిందట 6 ఎకరాల్లో ఆయిల్పామ్ పంట వేసిన. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై మొక్కలు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం కింద గుంతలు తీసిన్రు. మా కుటుంబ సభ్యులందరం కలిసి గీ పంటనే చూసుకుంటున్నం. ఒక్కసారి సాగు చేస్తే 25 నుంచి 30 ఏండ్ల దాకా పంట తీయొచ్చు. ఎకరానికి రూ.లక్ష దాకా లాభం ఉంటుంది. పంటకు పూజలు చేసి కోత ప్రారంభించినం.
-గుర్రం రాజన్న, పామాయిల్ రైతు
పంట సాగులో రిస్క్ ఉండదు
తక్కువ ఖర్చుతో రిస్క్ లేకుండా ఆయిల్పామ్ పంట సాగు చేయొచ్చు. తెలంగాణ సర్కారు సబ్సిడీపై మొక్కలు ఇవ్వడంతో ఆసక్తి చూపించాను. మూడేండ్ల కిందట మూడెకరాల్లో పంట వేసిన. ఈ రోజు కోతలు ప్రారంభించినం. 30 ఏండ్ల దాకా ఆదాయానికి ఢోకా ఉండదు. ఈ పంటకు వన్యప్రాణుల బెడద కూడా ఉండదు. ఏటా ఒకేరకమైన పంటలు వేసి నష్టపోయేకన్నా.. ఆయిల్పామ్ సాగు చేసి లాభపడటం బెటర్.
-సుంకరి మల్లయ్య, పామాయిల్ రైతు