రామగిరి, మే 14: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలను నమ్మొద్దని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీచేసినట్టు చెప్పారు. నల్లగొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కంచర్ల మాసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఉద్యోగార్థులకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఇంతకు ముందు ఉద్యోగాలు సాధించిన వారి అనుభవాలను తీసుకొని చదివితే అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.