హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివిధ పథకాల కింద చేయుతనందిస్తున్నది. తాజాగా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇచ్చిన మొత్తం రూ.6,837 కోట్లకు చేరింది. వీటిద్వారా దాదాపు 90 వేల మందికి లబ్ధి చేకూరింది. త్వరలో మరో రూ.400 కోట్ల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది.
టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తున్నది. ‘ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్’ అనే విధానాన్ని చేపట్టింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు టీ-ఐడియా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, వికలాంగులకు టీ-ప్రైడ్ పథకాల కింద ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టారు. మొదటి రెండు లక్షల ద్విచక్ర వాహనాలకు, మొదటి 20 వేల ఆటోరిక్షాలకు, మొదటి ఐదు వేల కార్లకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. 2023-24 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037కోట్లు కేటాయించింది. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు. 2022-23తో పోల్చితే ప్రోత్సాహకాలను రూ.1,000 కోట్ల వరకు పెంచారు.