హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు రిజర్వేషన్ కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేస్తూ గురువారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలకు సవరణ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం ఆలిండియా కోటా కింద.. 23 సీట్లు వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్ సీట్లలో 5% సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించనున్నారు. ఈ లెక్కన ఏటా 7 సీట్లు వారికి దక్కనున్నాయి. వీటిని నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 5% రిజర్వేషన్ కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి ఉద్యోగులకు 50 పడకలు
సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న దవాఖానలో తెలంగాణ సర్కారు 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు రిజర్వ్ చేసింది. ఉద్యోగులు, కార్మికుల చికిత్స నిమిత్తం ప్రత్యేకంగా ఈ పడకలను కేటాయించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సింగరేణి కార్మికుల పక్షపాతి కేసీఆర్: కవిత
తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవాన్ని సూచిస్తుందని గురువారం ఆమె పేర్కొన్నారు. సిమ్స్ ఎంబీబీఎస్ సీట్లలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించడం ముదావహమని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వారి పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. నీట్లో మెరిట్ ప్రకారం భర్తీ చేసే సిమ్స్ కాలేజీ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించడం హర్షదాయకమని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సిమ్స్లోని 50 % పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించడం కార్మిక కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని కవిత తెలిపారు. వారం ఉత్తర్వులు జారీ చేశారు.