హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్’ (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.3.60 కోట్ల చొప్పున మొత్తంగా రూ.43.20 కోట్ల నిధులను విడుదల చేసింది. మొదటి విడతగా ఈ సంవత్సరం ఆరు స్టోర్లు, వచ్చే ఏడాది మరో ఆరు స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. స్టోర్ల నిర్వహణకుగాను 12 మంది డాటా ఆపరేటర్లు, 36 మంది ప్యాకర్లు, 12 మంది వాచ్మెన్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకొనేందుకు తెలంగాణ స్టేట్ మెడికల్, శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుమతులు జారీచేసింది. అదేవిధంగా ఆర్టీసీ లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రవాణా వాహనాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు ప్రతి స్టోర్కు అనుమతులు ఇచ్చింది.
స్టోర్ల ఏర్పాటుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ను ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్కు అనుబంధంగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున సీఎంఎస్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా దవాఖానలు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలకు ఇక్కడి నుంచే ఔషధాలు సరఫరా అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇటీవల ఔషధాల సంఖ్యను గణనీయంగా పెంచడం, నిల్వలకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు రూపొందించడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాలకు దూరాభారం కారణంగా ఆలస్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 12 సీఎంఎస్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే దవాఖానల్లో మందుల కొరతకు పూర్తిగా చెక్ పడనున్నది. ఏవైనా మందులు అత్యవసరంగా కావాల్సి వస్తే వెంటనే సరఫరా చేసేందుకు అవకాశం కలుగనున్నది. సీఎంఎస్ల కోసం శాశ్వత భవనాలను నిర్మించనున్నారు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు పూర్తి ఉచితంగా వైద్యం అందాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఇందుకు తగిన మౌలిక వసతులు కల్పించాలని, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఉన్నతాధికారులు విస్తృతంగా అధ్యయనం చేశారు. కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నదని గుర్తించారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను 720 నుంచి 843కు పెంచారు. ఇందులో ఈఎంల్ జాబితాలో 311, ఏఎంఎల్ జాబితాలో 532 మందులు ఉన్నాయి. దీంతోపాటు ప్రతి దవాఖానలో కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందులు నిల్వ (బఫర్ స్టాక్) ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్లపై ఒత్తిడి పెరిగి, సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 12 సీఎంఎస్లను ఏర్పాటు చేయనున్నది. దీంతో ఔషధాల సరఫరాలో ఇబ్బందులు పరిష్కారం కావడంతోపాటు అత్యవసర సమయంలో మందుల రవాణా వేగవంతం కానున్నది. నిరీక్షణకు చెక్ పడనున్నది.
ఈ ఏడాది ప్రారంభించేవి: సిద్దిపేట మెడికల్ కాలేజీ, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా దవాఖానలు.
వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చేవి: సూర్యాపేట మెడికల్ కాలేజీ, నాగర్కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, గద్వాల జిల్లా దవాఖానలు, వికారాబాద్లోని ఏరియా హాస్పిటల్.