హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవికి క్యాబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహదారుల బాధ్యతలు అప్పగించింది. టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ వేణుగోపాల్రావును ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మల్లు రవి: కాంగ్రెస్లో నాలుగున్నర దశాబ్దాలుగా..
మల్లు రవి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. 1980లో యూత్ కాంగ్రెస్ డాక్టర్ సెల్ చైర్మన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెండు సార్లు నాగర్కర్నూల్ ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
షబ్బీర్ అలీ: దేశంలోనే తొలి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి
రాష్ట్రంలోని అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో షబ్బీర్ అలీ ఒకరు. ఆయన 1970వ దశకం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ఎస్యూఐలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో తొలిసారి కామారెడ్డి నుంచి గెలుపొందారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశంలోనే మొదటి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా అనేక శాఖలు చేపట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావించినా రేవంత్ రెడ్డి కోసం నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు.
వేం నరేందర్రెడ్డి: రేవంత్తో 16 ఏండ్ల స్నేహం
వేం నరేందర్రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మొదటిసారి 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్రెడ్డితో ఆయనకు సుమారు 16 ఏండ్లుగా స్నేహం ఉన్నది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే వారిద్దరి అనుబంధం కొనసాగుతున్నది. 2015లో వేం నరేందర్రెడ్డి ఎమ్మెల్సీగా బరిలో దిగారు. ఆయనను గెలిపించేందుకు జరిగిన ప్రయత్నంలోనే ఓటకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. నాటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రేవంత్రెడ్డి ఎదిగే వరకు నరేందర్రెడ్డి ఆయన వెంటే ఉన్నారు.
హర్కర వేణుగోపాల్: రాష్ట్రంలో పెద్దగా తెలియకపోయినా..
హర్కర వేణుగోపాల్ గురించి రాష్ట్రంలోని నేతలకు పెద్దగా తెలియకపోయినా.. ఢిల్లీ పెద్దలందరికీ ఆయన సుపరిచితుడు. ఆయనది పెద్దపల్లి జిల్లా అబాది రామగుండం. టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్గా ఆయన ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయం కుదుర్చడంలో విశేష కృషి చేశారు. ఢిల్లీ నుంచి నేతలు ఎవరు వచ్చినా, వారికి రవాణా సౌకర్యాలు, బస, నేతలతో మీటింగ్లు ఇలా అన్ని అంశాలను ఆయన దగ్గరుండి చూసుకున్నారు.
పేరు బాధ్యతలు