హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్వర్కుమార్, డాక్టర్ సుఖ్బీర్సింగ్ సంధు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని తెలిపారు. ఇప్పటివరకు రూ. 27.38 కోట్ల నగదు, రూ.10 కోట్ల విలువైన మద్యం స్వాధీన పర్చుకున్నామని వివరించారు. మర్చి 16 నుంచి ఇప్పటివరకు 6022 మందిని బైండ్ ఓవర్ చేశామని చెప్పారు.
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించడానికి ఎన్నికల అధికారులు పోస్టల్ శాఖ, రైల్వే, పెట్రోలియం సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. బీఆర్కేఆర్ భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఈవో వికాస్రాజ్, పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణశాఖ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ పీ భాస్కర్రెడ్డి, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు ఎన్నికల సంఘంతో ఒప్పందం చేసుకున్నారు.
పెట్రోల్ బంక్లలో హోర్డింగ్ ఏర్పాటుచేయడం ద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వేస్టేషన్లో డిజిటల్ విధానంలో ప్రకటనలు ప్రచారం చేయనున్నారు. పోస్టల్శాఖ వారు ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపులను రూపొందించడంతోపాటు ఇతర మార్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, బీపీసీఎల్ ప్రతినిధి కేఎస్వీ భాస్కర్, ఐవోసీ ప్రతినిధి బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
రాబోయే ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది.