హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరమున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో కొత్త రైస్ మిల్లుల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, రా (సన్న బియ్యం పట్టే) రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం పిలుపునిస్తున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ (దొడ్డు బియ్యం)కు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. పారాబాయిల్డ్ (దొడ్డు బియ్యం పట్టే) మిల్లులు ఏర్పాటైతే ఎలాంటి ప్రయోజనం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. పారాబాయిల్డ్ మిల్లుల లాభం లేదని ప్రభుత్వం భావిస్తున్నది. వీటివల్ల నష్టమే తప్ప లాభం ఉండదని సూచిస్తున్నది. మరోవైపు భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కూడా దొడ్డు బియ్యాన్ని తీసుకొనేందుకు అంగీకరించడంలేదు. సన్నాలే కావాలని అన్ని రాష్ర్టాలను కూడా కోరుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగాన్ని దొడ్డు బియ్యం కాకుండా, సన్న రకా లను పండించేదిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే రా (సన్న బియ్యం) రైస్ మిల్లుల ఏర్పాటుకు పిలుపునిచ్చింది. బుధవారం జరిగిన క్యాబినెట్లో పారాబాయిల్డ్ మిల్లుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించినట్లుగా పలు వార్తాపత్రికలు, చానెళ్లలో పొరపాటున ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం కేవలం సాధారణ రైస్ మిల్లుల ఏర్పాటును మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నది.