Fiscal Deficit | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘డబుల్ ఇంజిన్’ వృద్ధి అంటూ బీజేపీ నాయకులు చెప్తున్న పొడుగు మాటలన్నీ కేవలం గాలి మాటలేనని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం, వ్యయం మధ్య తేడా) ఎఫ్ఆర్బీఎం చట్టంలో పేర్కొన్న దానికంటే రెట్టింపు స్థాయిలో పయనిస్తున్నట్టు స్వయంగా మోదీ ప్రభుత్వమే అంగీకరించింది. ఈ లోటును పూడ్చుకునేందుకు మార్కెట్ నుంచి ఇబ్బడిముబ్బడిగా రుణాలను సమీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణ స్థాయికి దిగజారిందని, దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2020 మార్చి 1, జూలై 1, 2021 జనవరి 1లో చెల్లించాల్సిన కరవుభత్యం (డీఏ/డీఆర్) బకాయిలను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత వారం లోక్సభలో వెల్లడించారు.
కొవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా వాటిల్లిన నష్టాన్ని అధిగమించేందుకు రూ.34,402 కోట్లకుపైగా ఉపయోగించాల్సి రావడంతో ఉద్యోగులకు డీఏ/డీఆర్ బకాయిలను తీర్చడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఎఫ్ఆర్బీఎం చట్టంలో పేర్కొన్న దానికంటే రెట్టింపు స్థాయిలో పయనిస్తున్నట్టు తెలిపారు.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో (ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో) కేంద్ర ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 58.9 శాతానికి చేరింది. కానీ, ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో కేంద్ర ద్రవ్యలోటు పూర్తి వార్షిక లక్ష్యంలో ఏకంగా 67.8 శాతాన్ని తాకింది. కేంద్ర ప్రభుత్వ రాబడులు తక్కువగా, ఖర్చులు అధికంగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో ద్రవ్యలోటు రూ.11.9 లక్షల కోట్లకు చేరింది. దీన్ని పూడ్చుకునేందుకు మార్కెట్ నుంచి భారీగా రుణాలు సమీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా ఉండవచ్చని భావిస్తున్నది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.4 శాతానికి సమానం.
పై వాస్తవాలను తెలంగాణ బీజేపీ నేతలు తొక్కిపెడుతున్నారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. రుణాలను సమీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు వేతనాలను చెల్లించలేకపోతున్నదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీఎస్డీపీలో కేవలం 3.2 శాతంగానే ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఎఫ్ఆర్బీఎం పరిమితి (జీఎస్డీపీలో 4 శాతం) కంటే చాలా తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్యలోటు మరింత తగ్గుతుందని, జీఎస్డీపీలో 2.7 శాతం (రూ.38,235 కోట్లు) మించకపోవచ్చని అంచనా.