హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శీతాకాలం చివరి దశలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొన్నది. పగటి పూట ఎండలు మండిపోతుండగా, రాత్రిపూట మాత్రం చలిగాలలు వీస్తున్నాయి. వాతావరణశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. రానున్న నాలుగు రోజులు ఇలాంటి వా తావరణమే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.
ఆదివారం ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని పేర్కొన్నది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు నమోదు కాగా, హనుమకొండ, మెదక్, నిజామాబాద్లో 32 డిగ్రీలు నమోదైందని వెల్లడించింది. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది చలికాలంలో ఎక్కువ రోజులు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఈనెల చివరివారంలో ఒకట్రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఆ తర్వాత తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది.