హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. గోవా, హర్యానా, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ర్టా ల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 54 లక్షల విలువైన 21,500 లీటర్ల అక్రమ మద్యాన్ని తొమ్మిది రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో మద్యం అక్రమ రవాణా విషయాలను మంత్రి బుధవారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు మంత్రి చెప్పారు. 106 కేసులు నమోదు చేసి, 131 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారం రోజుల స్పెషల్ డ్రైవ్లో 85 కేసులు నమోదు చేసి, 81 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. కుత్బుల్లాపూర్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.30 లక్షల విలువైన 1,600 లీటర్ల హర్యానా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు డ్యూ టీ ఫ్రీ షాప్ నుంచి కొనుగోలు చేసిన 2 లీటర్ల విదేశీ మద్యాన్ని కలిగి ఉండవచ్చని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని లైసెన్స్ దుకాణాల ద్వారా కొనుగోలు చేసిన 4.5 లీట ర్ల మద్యాన్ని, 7.5 లీటర్ల బీర్లను కలిగి ఉండవచ్చని వెల్లడించారు. అంతకుమించి ఎవరి దగ్గరైనా మద్యం లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ర్టాల్లో పర్యటించి రాష్ర్టానికి వచ్చేటప్పుడు మద్యాన్ని తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపా రు. స్పెషల్ డ్రైవ్లో సమర్థంగా విధులు నిర్వర్తించిన ఎక్సైజ్ శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య, శంషాబాద్ ఈఎస్ సత్యనారాయణ, ఎస్హెచ్వోలు శ్రీనివాస్, గాంధీనాయక్, టాస్ఫోర్స్ అధికారులు వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.