న్యూఢిల్లీ, ఆగస్టు 20: క్యాన్సర్ వ్యాక్సిన్లు ఆకర్షణీయమైన వాగ్దానాల్ని అందిస్తున్నాయి. అయితే అవి ఆచరణాత్మకంగా రోగులకు అందుబాటులోకి రావడం లేదు. ఈ క్రమంలో మోడర్నా, మెర్క్ సంస్థల పరిశోధన ఆశాజనకంగా కన్పిస్తున్నది. క్యాన్సర్ కణాలన్నింటిపై విచక్షణారహితంగా దాడి చేయడానికి బదులుగా ఒక రోగిని వేధిస్తున్న నిర్దిష్ట క్యాన్సర్ను గుర్తించి, దానిని నాశనం చేసేలా రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వగలమా? అన్న ఆలోచనపై ఒక ముందడుగు పడింది. మోడర్నా, మెర్క్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యక్తిగతీకరించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ చికిత్సపై నిర్వహించిన భారీ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వచ్చాయి.
ఈ ట్రయల్లో వ్యక్తిగతీకరించిన వ్యాక్సిన్ను ఇప్పటికే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్న పెంట్లోలీజుమాబ్ అనే ఇమ్యునోథెరపీ మందుతోపాటు ఇచ్చారు. దీనిని పెంట్లోలీజుమాబ్ ఒక్కటే ఇచ్చిన చికిత్సతో పోల్చారు. ఈ అధ్యయనంలో పూర్తిగా శస్త్రచికిత్స ద్వారా తొలగించిన ఫేజ్ 2బీ ఐవైబీ-ఐవీ మెలనోమా ఉన్న 1,137 మంది పాల్గొన్నారు. గతంలో ఈ విధానంపై ఆసక్తిని పెంచిన 2బీ అధ్యయనం కంటే ఇది చాలా పెద్దస్థాయి పరీక్ష. అయితే నియోయాంటిజెన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే అది ఎలా పనిచేస్తుంది, ఈ విధానం చివరికి క్యాన్సర్ చికిత్సను మార్చగలదా? అన్నది త్వరలోనే తేలుతుంది.
ఈ మోడర్నా-మెర్క్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే.. పేషంట్ ట్యూమర్ను తొలగించిన తర్వాత ఈ థెరపీ ప్రారంభం అవుతుంది. సర్జరీ అనంతరం మెలనోమాను తొలగించిన తర్వాత లక్ష్యాలుగా ఉపయోగపడ గల మ్యుటేషన్లను గుర్తించి ఆ ట్యూమర్ను జన్యు విశ్లేషణ చేస్తారు. తర్వాత ఆ వ్యక్తి కణితి నుంచి ఎంపిక చేసిన నియోయాంటిజెన్లను సంకేతపర్చడానికి ఒక వ్యక్తిగతీకరించిన ఎంఆర్ఎన్ఏ టీకాను తయారు చేస్తారు.