Bandaru Dattatreya | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఉత్సవాలకు బండారు దత్తాత్రేయను ఆహ్వానించలేదు. వాస్తవానికి దత్తాత్రేయ గురువారం హైదరాబాద్లోనే ఉన్నా పిలువలేదు. ఈ విషయంపై దత్తాత్రేయ కూడా అసహనం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి తనకు ఆహ్వానం పంపలేదని మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. తాను తెలంగాణ వ్యక్తినని, ఉద్యమంలో పాల్గొన్నానని, ఇప్పుడు ఓ రాష్ర్టానికి గవర్నర్నని అయినా గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి.. గోల్కొండలో జరిగిన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా బీజేపీ సభలా జరిగింది. కిషన్రెడ్డి జెండా ఎగురవేయగా, బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, వివేక్ వంటివారే మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు.
వేదిక మొత్తం వారే కనిపించారు. కానీ, దత్తాత్రేయను మాత్రం పక్కనబెట్టారు. బీజేపీ నేతగానే కాకుండా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ‘అలయ్-బలయ్’ కార్యక్రమంతో తెలంగాణ సంస్కృతిని చాటిన వ్యక్తిగా దత్తాత్రేయకు మంచి గుర్తింపు ఉన్నది. పైగా ఆయన ప్రస్తుతం గవర్నర్గా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నా.. ఆహ్వానించక అవమానించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశాడని కూడా వారికి గుర్తుకు రాకపోవడం శోచనీయమని అంటున్నారు. కిషన్రెడ్డి ఈ కార్యక్రమ ప్రయోజనం మొత్తం తనకే రావాలనే తపనతోనే ఇలా చేశారని మండిపడుతున్నారు. స్వాతంత్య్ర వేడుకలను సీఎం కేసీఆర్ ఏటా గోల్కొండ కోటలో నిర్వహిస్తుండగా, దీనిని వ్యతిరేకించిన బీజేపీ నేతలు ఇప్పుడు అదే గోల్కొండ కోట మీద బీజేపీ అధికారిక ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.