హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విజ్ఞప్తికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ట్విట్టర్ ద్వారా.. పొద్దుతిరుగుడు పంట చేతికొచ్చిందని, రైతులకు మద్దతు ధర దక్కడం లేదని తెలిపారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.6,760 ఉండగా, మార్కెట్లో రూ.4-5వేలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నదని, తద్వారా రైతులు నష్టపోతున్నారని తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి.. వెంటనే మార్క్ఫెడ్ ఎండీ సత్యనారాయణరెడ్డితో మాట్లాడి పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎండీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 9 కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించనున్నట్టు ఎండీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. పొద్దుతిరుగుడు పంటను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని రైతులకు మంత్రి సూచించారు. ఈ యాసంగిలో 21,350 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు కాగా 16,995 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.