CM Relief Fund | నిజామాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు. ఈ విషయంలో మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి నెలరోజులు దాటినా పెదవి విప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు మంజూరయ్యేవి. ఇప్పుడీ విషయంలో స్పందించేవారు లేక సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలు అల్లాడిపోతున్నారు.
కుప్పలుగా పెండింగ్ ఫైళ్లు
సీఎంఆర్ఎఫ్ కోసం ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న వారు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దవాఖానల్లో చికిత్సలు పొంది ఒరిజినల్ బిల్లులతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ద్వారా సీఎంఆర్ఎఫ్కు సిఫార్సు చేయించుకున్న వారెందరో అప్డేట్ కోసం నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం గత అక్టోబర్లో షెడ్యూల్ విడుదలయ్యాక సీఎంఆర్ఎఫ్ ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబరులో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఇప్పటి వరకు పెండింగ్ ఫైళ్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు.
స్టేటస్ తెలియక అయోమయం
సీఎంఆర్ఎఫ్కు బాధితులు దరఖాస్తు చేసుకున్న తర్వాత విచారణ జరిగేది. బిల్లులను దవాఖానల్లోని రికార్డులతో పోల్చిచూసేవారు. అంతా ఓకే అనుకుంటే ఫైళ్లను సీఎం కార్యాలయానికి పంపేవారు. ఆ తర్వాత సాయాన్ని మంజూరు చేసేవారు. ఇందుకు తెల్లరేషన్కార్డును కూడా ప్రాతిపదికగా తీసుకునేవారు. ప్రభుత్వం మారాక ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇగ అస్తది, అగో అస్తది అంటున్రు
ఐదు నెలల క్రితం కడుపులో కణతికి ఆపరేషన్ చేయించుకుంటే రూ. 65 వేలు బిల్లు అయింది. ఈ బిల్లుతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసిన. కానీ, ఇప్పటికీ డబ్బులు రాలే. ఇదేమని అడిగితే ప్రభుత్వం మారింది, టైం పడుతుందని చెప్తున్నారు.
– ధర్మారెడ్డిగారి దుర్గారెడ్డి, మహ్మద్నగర్, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
ఒరిజినల్ బిల్లులన్నీ పెట్టినా
సెప్టెంబర్లో కిడ్నీ సమస్యకు ఆపరేషన్ జరిగింది. రూ. 80 వేలు అయింది. ఒరిజినల్ బిల్లులన్నీ పెట్టి ఐప్లె చేసిన. ఇప్పటికీ సాయం అందలే. అస్తదా?రాదా? అర్థమైతలేదు. కొత్త ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి పేదలకు మంచి చేయాలి.
– కోమటిపల్లి కృష్ణాగౌడ్, మహ్మద్నగర్, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
సీఎంఆర్ఎఫ్ డబ్బులు రాక అవస్థలు
మా అమ్మ అనారోగ్యంపాలైతే రూ. 3 లక్షలు పెట్టి ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించా. సాయం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు చెక్కు రాలే. గతంలో మా ఊళ్లోనే చాలామందికి డబ్బులు అచ్చినయ్. ఇప్పుడు నాకు మాత్రం రాలే.
– సోమశేఖర్, మైలారం, దర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా