ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్ఎస్ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ రానున్నారు. 17న ఉదయం నూతన సెక్రటేరియట్ ప్రారంభ కార్యక్రమంలో వారు అతిథులుగా పాల్గొననున్నారు.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త ప్రచారాస్ర్తాన్ని వేగవంతం చేసింది. ఖమ్మంలో ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో రెండో భారీ బహిరంగ సభ ఎంపికలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈసారి వేదికగా హైదరాబాద్ను ఎంచుకొన్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17నే పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటగా జరిగిన ఖమ్మం సభ దిగ్విజయంగా సాగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇతర జాతీయ నేతలు తరలివచ్చారు. ఆ సభలో బీజేపీ దుష్ట రాజకీయాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. మూడు, నాలుగు రాష్ర్టాలు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చిన అశేష జనం బీఆర్ఎస్ నినాదాలను మోసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసేలా, బీజేపీని ఎండగట్టేందుకు అస్త్రశస్ర్తాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే రెండో భారీ బహిరంగ సభకు ముహూర్తం పెట్టారు.
ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల, జాతీయ స్థాయి నేతల రాకతో ఖమ్మం సభ ఉర్రూతలూగింది. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్య నేతలు, వివిధ సంఘాలు, వర్గాల ప్రతినిధులు వస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత జరిగే సభలో వీరంతా పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో రెండో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు. హిందీతో పాటు ఉత్తరాది మాండలికాలను బాగా అర్థం చేసుకొనే ప్రజలు ఇక్కడ ఉంటారు. పైపెచ్చు తమిళనాడు, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సభ ఇక్కడ పెట్టడం వల్ల ఆయా వర్గాల వారిని, ఆయా రాష్ర్టాల ప్రజలను ప్రభావితం చేయొచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. మొట్టమొదటి సభ ఖమ్మంలో నిర్వహించటం వల్ల తెలుగు రాష్ర్టాలతోపాటు పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు, నాయకులు తరలివచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో సభ నిర్వహిస్తే.. ఇక్కడ నివసించే వివిధ రాష్ర్టాల ప్రజల సొంత ప్రాంతాల్లో బీఆర్ఎస్ పేరు వినపడేలా, ప్రజలు చర్చించేలా చేస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మం సభకు కేరళ సీఎం పినరాయి విజయన్ రాగా, ఇప్పుడు హైదరాబాద్ సభకు స్టాలిన్ వస్తున్నారు. ఏపీ ప్రజలు సొంతంగానే బీఆర్ఎస్ను ఆహ్వానిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బీఆర్ఎస్తోనే సాగుతున్నారు. అంటే దాదాపు దక్షిణాదిలోని రాష్ర్టాలన్నింటిలో బీఆర్ఎస్ వెంట నడిచే సైన్యం సిద్ధమయినట్టే. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్తోపాటు ఉత్తరాది కీలక నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ కూడా వచ్చి వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ సభకు మధ్య భారతంలోని హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్సింగ్, బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ రానున్నారు. అంటే ఉత్తర భారతం నుంచి కీలకమైన నేతల మద్దతు బీఆర్ఎస్కు లభించినట్టు అయ్యింది. దీన్నిబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి కీలకమైన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ను విస్తరించే ప్రణాళికను ముమ్మరంగా అమలు చేయనున్నారు.
ఫిబ్రవరి 5న మహారాష్ట్ర సరిహద్దు నాందేడ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అక్కడ ఆయనతో వివిధ సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మంగళవారం నాందేడ్లో సీఎం సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. నాందేడ్ చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు కూడా కేసీఆర్తో కలిసి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న ఆయా వర్గాల ప్రతినిధులు ఇప్పటికే కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్లో భారీ సభ, నాందేడ్లో సమావేశాలు పూర్తయితే స్వల్ప కాలంలోనే దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయి నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నేతలు కూడా కేసీఆర్ సమయాన్ని కోరారు.