SSC Results | పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు హాజరైంది. అయితే పరీక్షలు అయిపోయినప్పటి నుంచి ఫెయిల్ అవుతానేమో అని సాయిప్రియకు భయం పట్టుకుంది. దీంతో పరీక్షల అనంతరం దిగులుగా ఉండేది. ఇది గమనించి తల్లి ఆమెకు ధైర్యం చెప్పింది. ఫెయిల్ అయిన ఫర్వాలేదని చెప్పింది. అయినప్పటికీ సాయిప్రియ టెన్షన్ పడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే శుక్రవారం కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఇది గమనించిన సాయిప్రియ సోదరుడు తల్లికి చెప్పాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.