SSC Exams | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 3 గంటల పాటు పరీక్ష జరుగనున్నది.
సైన్స్, కాంపోజిట్ పేపర్లకు మాత్రం 20 నిమిషాలు అదనపు సమయాన్నిస్తారు. ఇక పేపర్ లీకేజీని అరికట్టడంలో భాగంగా పరీక్షాకేంద్రాల్లో సెల్ఫోన్లపై నిషేధం విధించారు. ఎండల తీవ్రతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ ఏడాది 11,456 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పరీక్షలు రాయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సిట్టింగ్ స్కాడ్లను రంగంలోకి దింపారు.