Warangal CP | వరంగల్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టెన్త్ పేపర్ విషయంలో కుట్ర జరిగిన మాట వాస్తవమని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నించారని వరంగల్ పోలీసు కమిషర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టెన్త్ హిందీ పేపర్ మాల్ప్రాక్టీసు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ దర్యాప్తు ప్రక్రియను, వ్యవస్థను బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును రాజకీయంగా చూడొద్దని అన్నారు. దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పోలీసు కమిషనర్ను బద్నాం చేస్తే, దర్యాప్తు ప్రక్రియను బద్నాం చేసినట్టేనని, ఇది బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుందని తెలిపారు. తాను అవినీతికి పాల్పడినట్టు రుజువుచేస్తే పోలీస్ యూనిఫాం విడిచిపెట్టి వెళ్లిపోతానని సవాల్ చేశారు. బండి సంజయ్ తనపై చేస్తున్న ఆరోపణలకు సీపీ రంగనాథ్ మంగళవారం మీడియా ముందు వివరణ ఇచ్చారు.
నిందతులకు సహజంగానే పోలీసులపై కోపం ఉంటుందని, బండి సంజయ్ అటువంటి ఆక్రోశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతానికి సంబంధించి ఇప్పుడు ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పనిచేశానని, వరంగల్ కమిషనర్గా ఐదు నెలల నుంచి పనిచేస్తున్నానని, గతంలో ఎప్పుడూ తన గురించి మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విజయవాడలో చోటుచేసుకున్న సత్యంబాబు కేసు గురించి మాట్లాడతున్నారని, దాని గురించి సంజయ్కి ఏం తెలుసునని, ఆ కేసును ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. తాను గతంలో పనిచేసిన ఖమ్మం, నల్లగొండ నుంచి నా బాధితులను తీసుకొస్తామని బండి సంజయ్ చెప్పారని, తన బాధితులంతా రౌడీషీటర్లు, పీడీ యాక్టు ఉన్నవారు, కబ్జాలు, చీటింగ్ కేసులలో అరెస్టయినవారేనని తెలిపారు. పోలీసుల బాధితులంతా లోఫర్లు, డాఫర్లు, చీటర్లు, రౌడీ షీటర్లే ఉంటారని, వారిని తీసుకొస్తే వాస్తవాలే వెల్లడిస్తారని అన్నారు.
బెదిరింపులకు లొంగం
విచారణ ప్రక్రియలో బెదిరింపులకు లొంగబోమని, దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీపీని బద్నాం చేస్తే దర్యాప్తు ప్రక్రియను బద్నాం చేసిట్టేనని రంగనాథ్ చెప్పారు. బండి సంజయ్ ఇప్పుడు దర్యాప్తు ప్రక్రియను, వ్యవస్థను బెదిరిస్తున్నారని, ఈ బెదిరింపులు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుందని స్పష్టం చేశారు. సీన్లో లేకున్నా, పాత్రధారిగా లేకున్నా, సూత్రధారిగా ఉంటే కేసులో ప్రధాన నిందితుడే అవుతాడని తెలిపారు. బండి సంజయ్తో తమకు గెట్టు పంచాయతీ ఏమీ లేదని, తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టులో చూపిస్తామని, కావాలనుకొంటే ఆయన తనపై పరువునష్టం కేసు వేసుకోవచ్చని పేర్కొన్నారు.
టెన్త్ పేపర్లో కుట్ర చేశారు
టెన్త్ హిందీ పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ కావడానికి ముందు జరిగిన ఫోన్ కాల్ డాటాను తీసుకున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. 92(1)సీఆర్పీసీ ప్రకారం ఇది కరెక్టు కాదని ఎమ్మెలే రఘునందన్రావు అన్నారని, ఆయన వాస్తవాలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. 91 సీఆర్పీసీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కాల్డాటా వివరాలను తీసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కుట్ర పన్ని పరీక్ష పేపర్ మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారని తెలిపారు. పరీక్ష రాసే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. కొంచమైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? అని ప్రశ్నించారు. అనవసరంగా కేసు పెట్టలేదని తమ వద్దనున్న ఆధారాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా?
బండి సంజయ్ తనను ప్రమాణం చేయాలని అంటున్నారని, అది అశాస్త్రీయమని, వినడానికి గమ్మత్తుగా ఉన్నదని సీపీ పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరే ముందే దీక్షా పరేడ్లో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తామని తెలిపారు. ‘ప్రమాణం చేయకుండా చెప్తే అంతా అబద్ధమేనా? ప్రమాణం చేసి ఏదైనా చెప్పవచ్చా?’ అని ప్రశ్నించారు. బండి సంజయ్ని ఆయన సమీప బంధువుల ఇంట్లో కార్యమ్రం తర్వాతే అరెస్టు చేసినట్టు అక్కడి పోలీసులు చెప్పారని వెల్లడించారు
సంజయ్ ఫోన్ మా దగ్గర లేదు
బండి సంజయ్ ఫోన్ తమ దగ్గర లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆ ఫోన్ నుంచి ఆ రోజు రాత్రి 1.14 గంటలకు చివరి కాల్ మాట్లాడినట్లు ఉన్నదని, అది బెజ్జంకి టవర్ పరిధిలో స్విచ్చాఫ్ అయినట్టు తెలిసిందని చెప్పారు. ఈ అంశాన్ని కరీంనగర్ పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. రాచకొండ, కరీంనగర్ పోలీసులు బండి సంజయ్ని తమకు జనగామ సమీపంలో అప్పగించారని, అప్పటికే ఆయన దగ్గర ఫోన్ లేదని స్పష్టం చేశారు.
యూనిఫాం వదిలేసి వెళ్లిపోతా
కేసులో నిందితుడిగా ఉన్న కారణంగానే బండి సంజయ్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీపీ రంగనాథ్ చెప్పారు. కేవలం బీజేపీ వాళ్లపైనే తప్పుడు కేసులు అంటూ ఆరోపిస్తున్నారని, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగితే తన పనితీరు గురించి వివరిస్తారని చెప్పారు. సెటిల్మెంట్లు, దందాలు చేసి అక్రమాస్తులు కూడబెట్టినట్టు బండి ఆరోపించారని, తన వద్ద ఒక్క అక్రమ ఆస్తి ఉన్నట్టు రుజువు చేసినా యూనిఫాం తీసి వెళ్లిపోతానని, రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తాము రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని, వరంగల్ పోలీసు కమిషనర్గా చట్టం ప్రకారమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వారినే కాకుండా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
ప్రతి వారం పోలీసు కమిషరేట్లో జరిగే ఫిర్యాదుల స్వీకరణను బండి సంజయ్ వచ్చి చూడాలని సూచించారు. ఒక్కో రోజు 600 మంది వరకు వస్తారని, వారంతా సామాన్యులు, పేదవాళ్లేనని చెప్పారు. ఇక్కడ మధ్యవర్తులు, దళారులు ఉండరని, వ్యవస్థపై నమ్మకంతోనే వస్తారని తెలిపారు. పోలీసు స్టేషన్ న్యాయానికి తొలిమెట్టు అని, న్యాయం జరిగేలా పోలీసు స్టేషన్ పనిచేయాలని భావిస్తానని తెలిపారు. తప్పు చేసిన వారెవరైనా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. భూకబ్జా కేసులలో అన్ని పార్టీల వారిని అరెస్టు చేశామని గుర్తుచేశారు. విధుల పరంగా ఏ తప్పు చేయనని, అందుకే రాత్రి గుండెమీద చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పారు.
హిందీ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బెయిల్
వరంగల్ లీగల్, ఏప్రిల్ 11: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జైలులో ఉన్న నిందితులకు మంగళవారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏ2 నిందితుడు బూర ప్రశాంత్, ఏ3 నిందితుడు గుండెబోయిన మహేశ్, ఏ5 నిందితుడు శివగణేశ్కు ఈ కేసులో ఊరట లభించింది. వీరి నుంచి మరింత సమాచారం సేకరించడం కోసం పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి గత గురువారం బెయిల్ మం జూరు చేసిన విషయం తెలిసిందే.