శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 19 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలతో పాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మొక్కులు నగదు రూపంలో రూ. 2,41,95,778 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు.
వీటితోపాటు 128 గ్రాముల బంగారం, 3 కేజీల 790 గ్రాముల వెండి ఆభరణాలు, 299 యూస్ఏ డాలర్లు, 30 ఆస్ట్రేలియా డాలర్లు, 120 కెనడా డాలర్లు, 01 మలేషియా రింగేట్, 15 యూఏఈ ధీర్హమ్స్ విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మజ, ఎస్ మాధవీలత, డాక్టర్ కనకదుర్గ, విజయలక్ష్మిలు, ధర్మరాజు పాల్గొన్నారు.